పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా రికార్డయింది. దీని తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. బీటలు వారాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. భూమి కంపించిన వెంటనే స్థానికులు నివాసాలను వదిలేసిన రోడ్డు మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు సంభవించడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.
ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 1: 24 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఇస్లామాబాద్ కు పశ్చిమ దిశగా 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఫలకాల్లోో సంభవించిన పెను కదలికల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్ లో సంభవించిన భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం అంచనా వేసింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం ప్రకారం పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన అత్తాక్ సమీపంలో సంభవించింది.
పాకిస్తాన్ పొరుగుదేశం తజకిస్తాన్ లో మధ్యాహ్నం 12:54 నిమిషాలకు భూమి ప్రకంపించిందని, దీని ప్రభావం సరిహద్దు ప్రాంతాల్లో కనిపించినట్లు వివరించింది. 10 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈ నెల 19వ తేదీన 5.6 తీవ్రతతో ఇస్లామాబాద్, ఖైబర్-పఖ్తుంఖ్వాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో శనివారం రాత్రి 7:25 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.2గా నమోదైంది. దీని ప్రభావం వల్ల కూడా పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో భూమి ప్రకంపించింది.
ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆహారం దొరకని పరిస్థితి నెలకొందక్కడ. ధాన్యాలను తీసుకెళ్లే లారీలు, భారీ ట్రక్కులను స్థానికులు దాడులు చేసే పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య భూకంపం వల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటు చేసుకోవడం మరింత ఇబ్బందులకు గురి చేసినట్టయింది.
‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.