Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

భద్రాచలం వ‌ద్ద‌ గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంట‌కూ ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స్థాయిలో నీటిమ‌ట్టం 69.60 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావ‌రిలో 23.15 ల‌క్ష‌ల క్యూసెక్కుల ప్ర‌వాహం కొన‌సాగుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 నుంచి గోదావరి నీటిమట్టం 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. 30 ఏండ్ల తర్వాత 70 అడుగులకు చేరువైంది. ఇప్పటివరకు రెండు సార్లుమాత్రమే 70 అడుగులు దాటింది. ఇప్పుడు 75 అడుగులు దాటితే 50 ఏండ్ల రికార్డును అధిగమించినట్లవుతుంది.

 

కాగా, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో మొదటిసారిగా వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల తర్వాత భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. నది తీవ్రరూపం దాల్చడంతో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్‌ నగర్‌ కాలనీ, అశోక్‌ నగర్‌, శాంతి నగర్‌ కాలనీ, రామాలయం ప్రాంతంలోని ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో నివాసాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ రాత్రి భద్రాచలంలోనే బసచేశారు. వరద, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిలిటరీ సహాయం కోరింది. దీంతో అత్యవసరంగా సికింద్రాబాద్ నుంచి వైద్య సిబ్బందితో కూడిన పది వాహనాలు బయలుదేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com