Tuesday, September 24, 2024
HomeTrending Newsతెలంగాణకు 3లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణకు 3లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు

8 సంవత్సరాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కార్యరూపం దాల్చిన టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించారు. ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులతో పాటు భవిష్యత్‌లో రానున్న పెట్టుబడులపై పరిశ్రమలు-ఐటీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కేటీఆర్.

2014 నుంచి గత నెల నవంబర్ వరకు దాదాపు 3 లక్షల 30 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలు కేవలం టిఎస్ ఐపాస్, ఐటీ-ఐటీ అనుబంధ రంగాల్లో వచ్చిన పెట్టుబడుల వివరాలు మాత్రమేనన్న కేటీఆర్, మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతో పాటు ఇతర రంగాలలోకి వచ్చిన పెట్టుబడులన్నింటిని కలిపితే ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయా రంగాల్లోకి వచ్చిన పెట్టుబడుల వివరాలను కూడా అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా వచ్చిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పెట్టుబడులతో ఇరవై రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగిందన్నారు కేటీఆర్. కేవలం ఒకటి రెండు రంగాలనే కాకుండా దాదాపు 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా తమ ప్రభుత్వం గుర్తించి పక్కా ప్రణాళికను రూపొందించి భారీ పెట్టుబడులను సాధించిందని కేటీఆర్ తెలిపారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించామన్నారు.

పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలసీలను రూపొందించడంతో పాటు అవసరమైన పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించిందన్నారు. ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు కేటీఆర్. ఈ పెట్టుబడులతో లక్షలాది మందికి ఉపాధి దక్కడం తనకు అత్యంత సంతృప్తి కలిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్నో ఏండ్లుగా అగ్రస్థానంలో ఉన్న దేశంలోని ఇతర నగరాలను హైదరాబాద్ దాటిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ దిశగా ముందుకు పోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీంతోపాటు ఐటీ మరియు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రానున్న సంవత్సర కాలానికి చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు తదితర అంశాల పైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీఎండి వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : మిడ్ వైఫ‌రీలో దిక్సూచి తెలంగాణ – యునిసెఫ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్