Friday, April 26, 2024
HomeTrending Newsకాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి కోమటిరెడ్డి: మంత్రి జగదీశ్‌ రెడ్డి

కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి కోమటిరెడ్డి: మంత్రి జగదీశ్‌ రెడ్డి

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని వెలమకన్నెలో మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌)కు రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా పీడించిన ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. బావులకాడి మోటార్లకు మీటర్లు పెట్టాని ప్రధాని యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తుంటే.. గుజరాత్‌లో మీటర్లు పెట్టి రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అయితే తన కంఠంలో ప్రాణముండగా రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వనని సీఎం కేసీఆర్‌ తెగేసిచెప్పారన్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరందుకున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇళ్లిళ్లు తిరుగుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. బీజేపీ స్వార్ధం వల్లే ఉపఎన్నిక వచ్చిందని, మునుగోడు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రచారం నిర్వహిస్తున్నారు. వెల్మకన్నెలో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జ్ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, సీపీఎం నేత తుమ్మల వీరారెడ్డి, సీపీఐ నాయకుడు నేలికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Also Read :  రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా మంత్రి జగదీశ్‌రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్