Thursday, June 11, 2026
HomeTrending Newsగోల్డెన్ టెంపుల్ లో  మళ్ళీ ఖలిస్తాన్ జెండాలు  

గోల్డెన్ టెంపుల్ లో  మళ్ళీ ఖలిస్తాన్ జెండాలు  

పంజాబ్ లో ఖలిస్తాన్ కలకలం మళ్ళీ మొదలైంది. అమృత్ సర్ లోని  శ్రీ హర్ మందిర్ సాహిబ్ ( స్వర్ణ దేవాలయం) లో ఆపరేషన్ బ్లూ స్టార్  జరిగి 37 సంవత్సరాలైంది. నాటి ఘటన గుర్తు చేసుకుంటూ ఈ రోజు గోల్డెన్ టెంపుల్ లో జరిగిన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖలిస్తాన్ కోసం ఆయుధాలతో తిరుగుబాటుకు ప్రయత్నించిన సిక్కుల దివంగత నేత జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే ఫోటోలతో పాటు ఖలిస్తాన్ జెండాలతో అనేక మంది సానుభూతిపరులు హాజరయ్యారు.

వందల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఖలిస్తాన్ కు  అనుకూలంగా నినాదాలు చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్  జరిగి నాలుగు దశాబ్దాలు కావస్తున్నా ఆనాటి రక్తపాతం సిక్కులు మరచి పోలేదు. సిక్కు మతంలో దందామి తక్సాల్ గ్రూపునకు భింద్రన్ వాలే నాయకత్వం వహించారు. ఖలిస్తాన్ పేరు తో ప్రత్యేక దేశం కోసం ఈ గ్రూప్ నిర్వహించిన అలజడితో నాడు పంజాబ్ అల్లకల్లోలంగా ఉండేది.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధి వేర్పాటువాదులను అణచివేయాలని ఆదేశించారు. భింద్రన్ వాలే తో సహా అనేక మంది తిరుగుబాటుదారులు గోల్డెన్ టెంపుల్ లో ఉన్నారనే సమాచారం కేంద్రానికి తెలిసింది. దీంతో భారత మిలిటరీ బలగాలు 1984 జూన్ 1వ తేది నుంచి 8 వ తేది వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో వేర్పాటువాదుల ఏరివేత చేపట్టాయి.

కెనడా, ఇంగ్లాండ్ తదితర యూరోప్ దేశాల్లో ఖలిస్తాన్ అనుకులవాదుల కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో, అది స్వర్ణ దేవాలయంలోనే ఖలిస్తాన్ జెండాలు, భింద్రన్ వాలే ఫోటోలతో సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో హాజరు కావటం చర్చనీయంశంగా మారింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular