Sunday, June 7, 2026
HomeTrending Newsఇంగ్లీష్ మీడియం వినియోగించుకోండి: హరీష్

ఇంగ్లీష్ మీడియం వినియోగించుకోండి: హరీష్

Quality Education: ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని, తల్లి దండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని కష్టపడుతూ… తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే కోరికతో ప్రైవేట్ స్కూల్స్ కు పంపుతున్నారని, అలాంటి వారికి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మెదక్ జిల్లా, అల్లాదుర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని హరీష్ రావు  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండున్నర కోట్ల రూపాయలతో చక్కటి జూనియర్ కాలేజీ భవనం ఇవాళ ప్రారంభం చేసుకున్నామని, ఒక్క రూపాయి ఫీజు కూడా లేకుండా పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. మన పిల్లలు ఇంకా బాగా చదవాలని, దీని కోసం కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తో పాటు ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలని సూచించారు

మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రూ. 7300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలాగా తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని, పేద పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే ఇంగ్లీషులో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ఖర్చులు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన చదువు చెప్పడమే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్‌లతో పాటు అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడే విధంగా మన ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయని చెప్పారు.

Also Read :  రోగి సహాయకులకు 5.రూ భోజనం – మంత్రి హరీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular