Thursday, September 26, 2024
HomeTrending NewsInvestments: అవి తప్పుడు కథనాలే: మంత్రి

Investments: అవి తప్పుడు కథనాలే: మంత్రి

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రాజెక్టులపై  ఎల్లో మీడియా విషం చిమ్ముతూ కథనం రాయడం దుర్మార్గమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. కావాల్సిన వాళ్లకు.. అయిన వాళ్లకే అనుమతి ఇస్తున్నారంటూ ఆ పత్రిక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు, సచివాలయంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తోందని, ఇవాళ జరిగిన  మంత్రివర్గ సమావేశంలో పలు ప్రాజెక్టులకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఇటీవలి ఎస్‌ఐపీబీ సమావేశంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన దాదాపు రూ.24 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులపై క్యాబినెట్‌లో చర్చించామని, ప్రధానంగా రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కడప స్టీల్‌ ప్లాంట్‌ సాకారం కానుందని తెలిపారు. వైయస్సార్‌ జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ నెలకొల్పే పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టులు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయని చెప్పారు.

గతంలో చంద్రబాబు కేవలం ఆర్భాట ప్రచారమే లక్ష్యంగా పని చేశారని, రాష్ట్రంలో దాదాపు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ, ఆర్భాటంగా మూడు సమావేశాలు నిర్వహించి, కొండంత ప్రచారం చేసుకున్నా.. వాస్తవంగా వచ్చింది కేవలం రూ.34 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రచారం చేసిన దాంట్లో కేవలం 2 శాతం పెట్టుబడులు మాత్రమే అప్పుడు వచ్చాయన్నారు.

తాము దావోస్‌లో రూ.1.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులపై వివిధ కంపెనీలతో చర్చించామని, పలు ఒప్పందాలు కూడా చేసుకున్నామని వివరించారు. ఆ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చేలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, అయినా ఎక్కడా డప్పు కొట్టుకోవడం లేదని, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. .

చంద్రబాబుకు దమ్ముంటే, గత 5 ఏళ్లలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు (పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లు), అప్పుడు పారిశ్రామికవేత్తలతో చేసుకున్న ఒప్పందాలపై బహిరంగ చర్చకు రాగలడా? అని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. మాయ మాటలతో ప్రజలను మభ్య పెట్టి మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్