The Aam Aadmi Party Has Announced Election Gifts To The People Of Goa :
గోవా ప్రజలకు అమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వరాలు ప్రకటించింది. ఆప్ అధికారంలోకి వస్తే ఆయా మతాల వారిని తమ పుణ్యక్షేత్ర దర్శనానికి ఉచితంగా రవాణ సౌకర్యం కల్పిస్తామని పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ గోవాలో ప్రకటించారు. హిందువులను ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పుణ్యక్షేత్రానికి, క్రైస్తవులను తమిళనాడులోని వెల్లంకిని దర్శనానికి, ముస్లీంల్లో సాయిబాబాను ఆరాధించే వారిని మహారాష్ట్రలోని షిరిడి దర్శనానికి లేదంటే రాజస్తాన్ లోని అజ్మీర్ దర్గాకు వెళ్లేందుకు ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుందని కేజ్రివాల్ వెల్లడించారు.
తీర్థ్ యాత్ర యోజనగా ఈ పథకానికి నామకరణం చేశారు. తాను ఇటీవల అయోధ్య పుణ్యక్షేత్రం దర్శించినపుడు ఈ ఆలోచన వచ్చిందని, ఆర్థిక భారం భరించలేని వారికి తీర్థ్ యాత్ర యోజన ప్రయోజనకారిగా ఉంటుందని కేజ్రివాల్ వివరించారు. అవినీతిమయమైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కై దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నాయని ఆప్ అధినేత ఘాటుగా విమర్శించారు. ఈ రెండు పార్టీలు విమర్శించుకోవటం తప్పితే ఒకరిపై ఒకరు సమగ్ర విచారణ జరిపించరని, ఉన్నతస్థాయి దర్యాప్తు చేపడితే రెండు పార్టీల నేతలు జైలుకు వెళతారని కేజ్రివాల్ అన్నారు. గోవా ముఖ్యమంత్రిగా పదేళ్ళు చేసిన కాంగ్రెస్ నేత అవినీతిపై ప్రస్తుత బిజెపి సిఎం ఎందుకు విచారణకు ఆదేశించరని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి గోవాలో వనరులు కొల్లగొడుతున్నాయని అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు.
Must Read :పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు