Friday, September 20, 2024
HomeTrending Newsవైద్య ఆరోగ్య రంగంలో ఏపీతో కలిసి పనిచేస్తాం: యునిసెఫ్

వైద్య ఆరోగ్య రంగంలో ఏపీతో కలిసి పనిచేస్తాం: యునిసెఫ్

గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్యరంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు  యూనిసెఫ్‌ సంసిద్దత వ్యక్తం చేసింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డితో యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ (ఏపీ, కర్ణాటక, తెలంగాణ)  డా. జేలలీమ్ బి, టఫ్ఫేస్సీ  భేటీ అయ్యారు.

ప్రైమరీ హెల్త్‌ కేర్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్‌వాడీ వర్కర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ వంటి వివిధ స్ధాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూనిసెఫ్‌ ముందుకొచ్చింది.

వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూనిసెఫ్‌ బృందంతో చర్చించిన సీఎం  జగన్, సుస్ధిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ముందుకెళుతున్న తీరును వివరించారు.

చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని యూనిసెఫ్‌ బృందం హామీ  ఇచ్చింది.

ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని,  చైల్డ్‌ మ్యారేజ్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దామని సిఎం వారికి వివరించారు.

ఈ సమావేశంలో యూనిసెఫ్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.పి. శ్రీధర్, యూనిసెఫ్‌ సోషల్‌ బిహేవియర్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌ సీమ, సీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ జానకి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్