Praja Sankalpa Padayatra: ఎన్ని కష్టనష్టాలకు ఓర్చైనా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించి…అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు మాట పక్కనబెట్టి…టిడిపి వెబ్ సైట్ లోనుంఛి సైతం మేనిఫెస్టో కాపీని తీసివేసిన ఘనుడు అని విమర్శించారు. జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగిసి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ మేనిఫెస్టోను భగవధ్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తూ ముఖ్యమంత్రి జగన్ దానిని తన ఎదురుగా పెట్టుకుని నిత్యం సమీక్షించుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పనిచేస్తున్నారన్నారని కొనియాడారు. సిఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి నేటి వరకు అదే రీతిలో అంకితభావంతో పనిచేస్తున్నారన్నారని వివరించారు. ఇడుపుల పాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఎండ, వాన, చలి లాంటి వాటిని లెక్కచేయకుండా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర 341 రోజులు కొనసాగించారని, 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2,156 గ్రామాలను కలుపుకుంటూ కోట్లాదిమందిని స్వయంగా కలుస్తూ, వారి సమస్యలు వింటూ సాగిందని మంత్రి గుర్తు చేశారు.
శాసనమండలి సభ్యులు, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను రూపొందించి దానిని అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్ దేనని అన్నారు. మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నారని, ఇప్పటికే దాదాపు 90 శాతం హామీలు నెరవేర్చారని, ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. భగవంతుడి ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఉమ్మారెడ్డి ఆకాంక్షించారు.
శాసనమండలి సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర 2019 జనవరి 9న ముగిసిందన్నారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎలా ఉంటాడో.. సిఎం జగన్ ను చూసి భవిష్యత్తు తరాలు నేర్చుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరక్టర్లు, పలువురు పార్టీ నేతలు, జగన్ తో కలసి ప్రజాసంకల్పయాత్రలో నడిచిన పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న రోశయ్య(అద్దంకి నియోజకవర్గం); దానియేల్ (ప్రత్తిపాడు నియోజకవర్గం) ; హరికృష్ణ(తిరుపతి నియోజకవర్గం) ; సురేష్(నారావారిపల్లె) ; విక్రమ్ (కైకలూరు) ; ఇక్భాల్ భాషా(నంద్యాల) ; గోవిందరాజు(సత్తెనపల్లి) ; ఆనందరావు (పెదకూరపాడు) ; శ్రీనివాసరరెడ్డి(పాణ్యం) ; శ్రీను(అమలాపురం) ; వెంకటేశ్వరరెడ్డి (నరసారావుపేట) ; సతీష్(పార్వతీపురం) తదితరులను నేతలు సత్కరించారు.