Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. సర్కార్ కి అనుకూలంగా 160 ఓట్లు రాగా.. ప్రతికూలంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 243 మంది సభ్యులున్న సభలో.. 164 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ బల పరీక్ష నెగ్గడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఫ్లోర్ టెస్ట్ కి ముందు నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఓటింగ్ జరగడానికి ముందే సభ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. తనపై ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందే బీజేపీ నేత అయిన స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేయడంతో.. డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ (జేడీ-యూ) ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు.

మూజువాణీ ఓటింగ్ లో 160 మంది సభ్యులు నితీష్ సర్కార్ కే తమ ఓటని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితీష్ కుమార్.. బీజేపీపై నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో తానేంటో నిరూపిస్తానని ఆ పార్టీకి సవాల్ విసిరారు. భారత స్వాతంత్య్ర సమరంలో మీరంతా ఎక్కడున్నారని, అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ వంటి నాయకులు తనను ఎంతో గౌరవించేవారని ఆయన అన్నారు. మా జేడీ-యూ పార్టీని చీల్చాలని మీరు చూశారు.. కానీ మీ యత్నాలు వృధా అయ్యాయి అని బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 2017 లో పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆయన కేంద్రాన్ని దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు మీరు మీ పనులను అడ్వర్టైజ్ చేసుకోవడానికి అదే పని చేస్తారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం తమ పథకాలుగా చెప్పుకుంటుందని, ‘హర్ ఘర్ జల్’ అన్నది తమ ప్రభుత్వ పథకమని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పథకాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలోనే చేపట్టారన్నారు. ‘మీరంతా అప్పుడు పిల్లలు.. దయచేసి నేర్చుకోండి.. ఈ స్కీములకు క్రెడిట్ కేంద్రానిది కాదు’ అని నితీష్ కుమార్ బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.

Also Read : ఎన్డీయేకు నితీష్ కుమార్ షాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com