ఐర్లాండ్ తో రెండు మ్యాచ్ ల టి 20 సిరీస్ కు ఎంపిక చేసిన బృందంలో రాహుల్ తెవాటియాను కూడా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని క్రికెట్ లెజెండ్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్ లో అతని దూకుడుతనం జట్టుకు ఎంతో ఉపయోగమని చెప్పాడు. “అతన్ని అదనపు ఆటగాడిగా అయినా తీసుకొని ఉండాల్సింది, ఐపీఎల్ లో అతడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు, కొన్ని మ్యాచ్ లను చివర్లో ఒంటిచేత్తో గెలిపించాడు. గొప్ప మ్యాచ్ ఫినిషింగ్ ఆటగాడు, అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అతడికి అవకాశం కల్పిస్తే స్ఫూర్తి ఇస్తుంది, బంతిని చక్కగా ఆడగలడు, ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ కూడా బంతిని పరిగెత్తిస్తాడు” అని గవాస్కర్ ప్రశంసించాడు.
ఐపీఎల్ లో గతంలో రాజస్థాన్ రాయల్స్ కు, ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గుజరాత్ ఓటమి దశలో ఉన్న నాలుగైదు మ్యాచ్ లను తన బ్యాట్ తో మలుపు తిప్పి గెలిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ కు అవకాశం లభిస్తుందని తెవాటియా ఆశించాడు. కనీసం ఐర్లాండ్ టూర్ కైనా తన పేరు పరిశీలిస్తారని భావించాడు. జట్టులో చోటు దక్కపోవడంతో నిరాశ చెందాడు.
ఐర్లాండ్ తో సిరీస్ కు జట్టును ప్రకటించగానే ‘అంచనాలు గాయపడ్డాయి’ (expectations hurts) అంటూ ట్వీట్ చేసి తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు.
Also Read : ఐర్లాండ్ తో సిరీస్ కు హార్దిక్ సారధ్యం