Friday, June 12, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జూన్ 15న వాహన మిత్ర: మంత్రి పేర్నినాని

జూన్ 15న వాహన మిత్ర: మంత్రి పేర్నినాని

వైఎస్ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది జూన్ 15న సీఎం జగన్‌ ప్రారంభిస్తారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చెప్పిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జూలైలో వాహనమిత్ర ఇవ్వాల్సి ఉందని, కానీ కరోనా, కర్ఫ్యూ కారణంగా ముందుగానే వాహనమిత్ర ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్నినాని తెలియజేశారు.

2,23,238 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగిందని, కొందరు ఆటోలు అమ్మివేయడంతో వారిని జాబితా నుంచి తొలగించామని, కొత్తగా ఆటో కొనుక్కున్నవారు ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని, 10న ప్రాసెస్ చేస్తారని, 12న స్ధానిక అధికారులు మొత్తం వివరాలు పరిశీలిస్తారని మంత్రి వివరించారు. ఈనెల‌ 13న రవాణాశాఖ లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేస్తుందని, 15న సీఎం జగన్ వాహనమిత్ర పధకాన్ని ప్రారంభిస్తారని మంత్రి పేర్ని వివరాలు తెలియజేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటోరిక్షా, టాక్సీ, మాక్సీ క్యాబ్ యజమానులందరూ అర్హులని, 300 యూనిట్స్ పైబడి గృహ విద్యుత్ వినియోగించేవారికి ఈ పథకం వర్తించదని పేర్ని నాని స్పష్టం చేశారు. వెయ్యి చదరపు అడుగుల ఇల్లు, మూడు ఎకరాల మెట్ట, పది ఎకరాల మాగాణి ఉన్నవారిని కూడా ప్రస్తుతానికి నిలుపుదల చేశామని నాని వివరించారు. తలిదండ్రులు పారిశుధ్య కార్మికులైన వారి పిల్లలకు వెసులుబాటు ఇచ్చామన్నారు. జాబితాలో లబ్ధిదారుల పేరు లేకపోతే సచివాలయంలో తగిన ఆధారాలతో సంప్రదించాలని పేర్ని నాని పేర్కొన్నారు. ఆటోతో సహా ఫోటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేయించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular