Tuesday, September 24, 2024
HomeసినిమాKushboo: అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నాను - ఖుష్బూ

Kushboo: అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నాను – ఖుష్బూ

గోపీచంద్, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 5న ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే…

ఈ సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా.. కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం రూపొందింది. అందుకే రామబాణం నాకు అంత దగ్గరైంది. ఇందులో నా పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా నా పాత్ర ఉంటుంది. నా పాత్ర పేరు భువనేశ్వరి. ఆ పాత్రను దర్శకులు మలచిన తీరు చాలా బాగుంది.

మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉండేది కానీ.. తెలుగు పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చాక, నేను నా కుటుంబం కోసం అక్కడే ఉండిపోయాను. తమిళ్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు గాక తెలుగులో చంటి వంటి సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ కొంచెం బాధ ఉంది.
గోపీచంద్ తో కలిసి మొదటిసారి నటించాను. సెట్స్ లో గోపీచంద్ చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్లిపోతుంటారు. కారవాన్ లో కంటే ఎక్కువగా లొకేషన్ లో కుర్చీలో కూర్చోడానికే ఇష్టపడతారు. ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఇక జగపతిబాబు గారంటే ఆయన నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. బాల నటిగా వారి బ్యానర్ జగపతి ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేశాను. ఆయన మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామ అని పిలుస్తాను.

ఈ సినిమాలో చాలా మంచి సందేశం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఈ సినిమా చెబుతుంది. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ రోల్స్ చేశాం, డ్యాన్స్ లు చేశాం.. అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. ఎలాంటి పాత్రలు చేస్తున్నారని చూస్తున్నారు. ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు పోషించాలి. అలాంటి పాత్రనే రామబాణం చిత్రంలో చేశాను. అజ్ఞాతవాసిలో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు అంగీకరించలేదు అనుకుంటాను. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. వారిసు(వారసుడు)లో 18 నిమిషాల నిడివి గల బలమైన పాత్రను పోషించాను.. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్రను తొలగించారు.

తెలుగులో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకి ప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అందుకే సినిమాలు తక్కువ చేస్తున్నాను. అమితాబ్ బచ్చన్ తో కలిసి చీని కం లో టబు నటించింది. ఆ ఛాన్స్ టబు కొట్టేసినందుకు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అమితాబ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని. నా బెడ్ రూమ్ లో ఆయన పోస్టర్స్ కూడా ఉంటాయి. అమితాబ్ గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఆయనకు జోడీగా చేయలేదనే బాధ ఉంది. ఇప్పటి దాకా బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు. ఆయన తో సినిమా చేయాలని ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్