Saturday, July 27, 2024
HomeTrending Newsకేసీఆర్ పాలనలో రౌడీ రాజ్యం - బండి సంజయ్

కేసీఆర్ పాలనలో రౌడీ రాజ్యం – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై…. రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రపంచమంతా విస్తుపోయేలా పాలన కొనసాగిస్తున్న చరిత్ర నరేంద్రమోదీదైతే… ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనత కేసీఆర్ దని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బీజేపీ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూకుట్ పల్లిలో జరిగిన సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షులు హరీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర కోశాధికారి భండారు శాంతికుమార్, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, మీసాల చంద్రయ్య, సీనియర్ నాయకులు సూర్యారావు, సూర్యప్రకాశ్ రావు, రాజ్యలక్ష్మీ, మహేందర్, సునీత, దివాకర్, అరుణ్ కుమార్, నాగ పరిమళ, మహేశ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగ పూర్తి పాఠం వివరాలు….

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనలో జరిగిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం.

మోదీ ప్రధాని కాకముందు దేశంలో పరిస్థితులెట్లా ఉండేవో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి… ఆనాడు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అన్ని రంగాలను అవినీతి మయం చేసింది. ఏ శాఖలో చూసినా కుంభకోణాలే. ప్రపంచమంతా నివ్వేరపోయింది. భారత్ అంటేనే స్కాంల దేశమని హేళన చేశారు. పంచ భూతాలను కూడా అవినీతి మయం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. యూపీఏ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూసి ఆనాడు భారత్ కు అప్పు ఇచ్చేందకు కూడా ప్రపంచంలో ఎవరూ ముందుకు రాని దుస్థితి. అంతెందుకు భారత సైనికుల తలలు నరికి చంపిన పాకిస్తాన్ తో శాంతి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ముస్లిం సంతూష్టికరణ విధానాలను అమలు చేస్తూ యావత్ హిందువుల మనోభావాలను అడుగడుగునా అవమానపర్చిన నీచ చరిత్ర కాంగ్రెస్ ది.

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ రూపురేఖలనే మార్చేశారు… మచ్చలేని నీతివంతమైన పాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూకాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్భాగమేనని ప్రపంచానికి చాటి చెప్పారు. కాశ్మీర్ ఫైల్స్ చూశారు కదా… ఆ సినిమాలో చూపించింది ఒక్క శాతమే. అంతకుమించి దారుణ మారణ సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నయ్. బాంబులు పేల్చి, తల్వార్లతో పొడిచి చంపుతున్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్… దో ప్రధాన్ నహీ చలేగా అంటూ 370 ఆర్టికల్ ను రద్దు చేసిన ఘనత బీజేపీదే….

టీఆర్ఎస్ కు, కేసీఆర్  కు నేను సవాల్ చేస్తున్నా…. 8 ఏళ్ల మోదీ పాలనపై…. 8 ఏళ్ల నీ మూర్ఖపు పాలనపై చర్చకు సిద్ధమా? మేం సిద్ధంగా ఉన్నాం… దమ్ముంటే బహిరంగ చర్చకు రా….. ప్రధానమంత్రిని, కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారే తప్ప పేదలకు ఏమాత్రం న్యాయం చేయని సీఎం కేసీఆర్… తెలంగాణ రాకముందు ఎట్లాంటి పరిస్థితులున్నయో 8 ఏళ్ల తరువాత కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులున్నయ్. నమ్మి ఓటేస్తే కేసీఆర్ నిండా ముంచిండు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి దివాళా తీయించిండు. పుట్టబోయే బిడ్డతోసహా ఒక్కొక్కరి తలపై లక్షా 20 వేల రూపాయల అప్పు చేసిండు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం లేదు. కేంద్రం ఇండ్లు ఇస్తున్నా… వాటిని కట్టివ్వకుండా కేసీఆర్ పేదలను మోసం చేస్తున్నడు.

కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను సహా అన్ని ఛార్జీలు పెంచి ఆదాయాన్ని దండుకుంటున్నా… ప్రభుత్వ ఉద్యోగులకు నేటికీ సక్రమంగా జీతాలు ఇవ్వలేని దుర్మార్గపు సీఎం కేసీఆర్ మాత్రమే. పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయం దండుకుంటున్నడు. మద్యం పేరుతో వేల కోట్లు సంపాదిస్తున్నడు. మద్యాన్ని తాగించి శాంతిభద్రతలు క్షీణింపజేస్తున్నరు. కేసీఆర్ పాలనలో రోజుకో అత్యాచారం వెలుగు చూస్తోంది. ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని సదస్సు పెట్టిన పాపానికి జిట్టా బాలక్రిష్ణారెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసి కేసీఆర్ పైశాచిక ఆనందం పొందుతున్నరు.

కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటి గుర్తుంచుకోవాలి… ఎన్ని కేసులు పెట్టినా… అరెస్టు చేసినా బీజేపీని ఏమీ చేయలేవు. నీ పాలనను అంతమొందించేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం.. ఇక్కడ రైతులను నిలువునా ముంచిన ఘనత కేసీఆర్ దే.. రైతు బంధు తప్ప అన్నీ సబ్సిడీల బంద్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్.. ఇంకా సిగ్గు లేకుండా దేశాన్ని ఉద్దరిస్తాడట… జీతాలకు పైసల్లేవు… రైతు బంధు ఇవ్వడానికి పైసల్లేవు.. పెన్షన్లు ఇవ్వడానికి పైసల్లేవ్.. కానీ ప్రజలు కడుతున్న పన్నులను సొంత పబ్లిసిటీ పేరుతో దేశమంతా పత్రికలకు ప్రకటనలిచ్చి వందల కోట్లు ఖర్చు చేస్తుండు..

ప్రజలు పన్నుల పేరుతో కడుతున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. గత మూడేళ్లలో 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న ఘనత కేసీఆర్ దే. ఇంత చేసినా ఆర్టీసీ కార్మికులకు జీతాలివ్వడం లేదు. 2 పీఆర్సీలు, 5 డీఏలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నడు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేసి ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నడు.  పాతబస్తీ కూడా అభివ్రుద్ధి కావాలని కోరుతున్న పార్టీ బీజేపీ… పాతబస్తీ ప్రజలారా… అభివ్రుద్ధి కావాలా? మజ్లిస్ రాజకీయాలు కావాలా?.. ఒక్కసారి ఆలోచించాలి. బీజేపీ ఏనాడూ అల్లాను కించపర్చలే… నా రాముడిని అవమానించిన వాడిని, 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న మూర్ఖుడికి శిక్ష వేయించడంలో ఆధారాలు చూపకుండా కాపాడిన మూర్ఖుడు కేసీఆర్.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం. అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే ఎంఐఎం నేతలారా… ఇన్నేళ్లయినా పాతబస్తీలో డ్రైనేజీ ఇంకా ఎందుకు పొంగి పొర్లుతోంది? ఎందుకు పాతబస్తీ అభివ్రుద్ది కావడం లేదు? ప్రజలు ఆలోచించాలి. లుంబిని పార్కు, సాయిబాబా గుడిలో, గోకుల్ ఛాట్ లో బాంబులు పెట్టిందెవరో ప్రజలకు తెలుసు. ముస్లిం ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పలికి అధికారంలోకి తీసుకురావాలని ముస్లిం సమాజం ఆలోచిస్తున్న తరుణంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రకు తెరలేపాయి.

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే బీజేపీ ఉద్యమించే వరకు కేసు నమోదు చేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలెవరూ స్పందించలేదు. పోలీసులు పట్టించుకోలేదు. బీజేపీ ఉద్యమించకపోతే రేప్ చేసిన వాళ్లు హిందువులేనని కుట్ర చేసేందుకు టీఆర్ఎస్ ఫ్రభుత్వం యత్నించేది. పాతబస్తీలో అత్యాచారం, హత్యలు జరిగితే పట్టించుకోరు. సరూర్ నగర్ లో నాగరాజును నడిరోడ్డుపై నరికి చంపితే పట్టించుకోరు.. మంథనిలో వామన్ రావు, ఖమ్మంలో వనమా రాఘవేందర్ వేధింపులు భరించలేక రామక్రిష్ణ కుటుంబం, ఖమ్మంలో పోలీసులు, టీఆర్ఎస్ వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహథ్య చేసుకున్నరు. నిన్నగాక మొన్న కార్ఖానాలో అత్యాచారం జరిపింది టీఆర్ఎస్ నేతలే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినా… సీఎం కేసీఆర్ మాత్రం క్రిమినల్స్ ను పెంచి పోషిస్తున్నరు. ఫాంహౌజ్ నుండి బయటకు రావడం లేదు. కేసీఆర్ ఫాంహౌజ్ లో పడుకోవడానికేనా… కేసీఆర్ కుటుంబానికి అధికారం అప్పగించడానికేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. రైతులు అల్లాడుతున్నరు. మహిళలు కనీసం రోడ్లపై తిరగలేని పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం లేదు… కార్మికులు, ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు… వ్రుద్దులకు పెన్షన్లు ఇవ్వడం లేదు… కేసీఆర్ పాలనలో అగ్రవర్ణాలూ బాధపడుతున్నయ్. చివరకు వెలమ సామాజికవర్గం కేసీఆర్ ఫాలనలో ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్రంలో ఏ సంస్థ నిర్వహించినా టీఆర్ఎస్ పనైపోయిందని నివేదికలొస్తున్నాయి. కేసీఆర్ పనైపోయిందని చెబుతున్నాయి. తెలంగాణలో పేదోళ్లు బాగుపడాలంటే… కేంద్ర పథకాలు రాష్ట్రానికి అందాలంటే… రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనంటూ తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది.

యూపీలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంవల్లే యోగి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. శాంతి భద్రతలు ఫరిఢవిల్లుతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కబ్జాకోరులు, గూండాలు, క్రిమినల్స్ రాజ్యమేలుతున్నరు. వీళ్లను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలంటే బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా… అందరికీ అవకాశం ఇచ్చారు… బీజేపీకి అవకాశమిస్తే కేసీఆర్ కుటుంబ పాలనను తరిమి తరిమి కొడతాం… కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పాతరేస్తాం… బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేస్తాం… తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న కేసీఆర్ పాలనను తెలంగాణ ఉద్యమకారులంతా బరిశెలందుకుని తరిమితరిమి కొట్టే రోజులు ముందుకు రాబోతున్నాయ్…

Also Read : 

రైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ

RELATED ARTICLES

Most Popular

న్యూస్