Tuesday, May 14, 2024

మంచి – చెడు

Kohli displays sportsmanship after defeat; Dhoni mingles with Pakistani players

ద్వేషం- స్ఫూర్తి…ఇప్పుడీ రెండూ చర్చలే! చిరకాల దాయాది దేశమైన పాకిస్థాన్ తో ఏం జరిగినా.. దేశంలో చర్చకు రాక మానదు. అందులో క్రికెట్! ముమ్మాటికీ చర్చోపచర్చలే!! ఈక్రమంలోనే రెండు కంప్లీట్ కాంట్రాస్ట్ డిస్కషన్స్ కి తెరలేచింది.
అదే-
ఒకటి ద్వేషం!
ఇంకోటి స్ఫూర్తి!!

అంతకుముందు రెండు సన్నాహక మ్యాచుల్లో దుమ్ముదులిపిన ఇండియా… అతివిశ్వాసమో.. లేక, చాలాకాలం తర్వాత పాక్ తో క్రికెట్ అనేసరికి అమాంతం లేచిన భావోద్వేగాలో.. లేక, అజాగ్రత్త, నిర్లక్ష్యమో.. వెరసి అటు పాకిస్థాన్ లో సంబరాలెన్ని చేసుకున్నారో, ఎంత చర్చ జరిగిందో తెలియదుగానీ.. భారత్ లో మాత్రం రకరకాల చర్చలకు తావిచ్చింది.

వాస్తవానికి మంగళవారం రోజు అక్టోబర్ 24న భారత్ తో జరిగిన మ్యాచులో మనవాళ్లు ఒత్తిడినెదుర్కొన్నా.. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ లో ఎంతో కొంత పోరాడారు. పంత్ కూడా కీలక సమయంలో జట్టుకు అండగా నిలబడ్డాడు. అయితే ఆ స్కోరు చూసి భారత బౌలర్లు జడుసుకున్నారో.. లేక భారత్ బౌలర్లను లైట్ తీసుకోవాలనే ముందస్తు మానసిక సన్నద్ధతోగానీ.. పాక్ బ్యాట్స్ మెన్ మాత్రం చీల్చి చెండాడారు. అందుకే విజయం పాక్ వైపు.. మన దేశంలో చర్చోపచర్చల కోసం ఓటమి భారత్ వైపు నిల్చుంది.

మ్యాచ్ పూర్తైననంతరం.. మెంటార్ గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ.. ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ కూడా పాక్ ప్లేయర్లతో కలిసిపోయిన తీరు.. వారినభిందించిన వ్యవహారమంతా వాస్తవానికి స్ఫూర్తి నింపే విషయం. ఎందుకంటే ఓవైపు అటు చైనా.. ఇటు పాక్ తో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే ఉద్రిక్త పరిస్థితుల్లో… క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ… భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత నాయకుడైన కోహ్లీలు ముచ్చటించిన తీరు.. కచ్చితంగా వారి హుందాతనానికీ, వారి మెచ్యూరిటీకి అద్దం పట్టేవే.

Dhoni Interacts With Pakistani Players After T20 World Cup Match

అయితే అదే సమయంలో అంతే జోయల్ గా పాక్ ఆటగాళ్లు కూడా ధోనీ, కోహ్లీతో కలిసిపోవడమూ ఆహ్వానించదగ్గ స్ఫూర్తిదాయక విషయమే! అయితే ఈ విషయం ఓవైపు తెగ వైరలవుతూ… ఇరుదేశాల మధ్య రాజకీయంగా, భౌగిళికంగా, మానసికంగా, సరిహద్దు పరంగా ఎన్ని గొడవలున్నప్పటికీ… చాలా మందినీ ఆకట్టుకున్న చర్చైతే… భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్లిం క్రికెటర్లపై విద్వేష ప్రచారం సాగడం కలచివేసింది.

మహ్మద్ షమీని తులనాడుతూ సాగిన ట్రోలింగ్ భారత్ లో ఒకవర్గం ఇంకా విద్వేషాలను ఎలాగైనా రెచ్చగొట్టేందుకు ఎంతో ప్రాధాన్యతనిస్తోంది.. ఎలా కంకణం కట్టుకుందో పట్టిచూపిస్తుంది. అయితే షమీ ముస్లిం కాబట్టి… పాకిస్థాన్ పై సరిగ్గా బౌలింగ్ చేయలేదన్నది స్థూలంగా దాని సారాంశం. దీనికేమైనా ఆధారముందా అంటే అలాంటివేవీ ఉండవు.కానీ సామాజికవర్గాలు, మతపరమైన లెక్కలవారీగా.. ఇలాంటి ఆరోపణలు పలు విషయాల్లో ఎలాగైతే సర్వసాధారణంగా వస్తుంటాయో… అందులో భాగంగానే షమీనీ టార్గెట్ చేశాయి కొన్ని శక్తులు. అయితే ఈ విషయాన్ని ఇండియన్ టీమ్ సభ్యులతో పాటు… వెటరన్ క్రికెటర్స్ సెహ్వాగ్ వంటివారు కూడా తీవ్రంగా ఖండించారు. సెహ్వాగ్ చేసిన ట్వీట్ నే సుబ్రహ్మణ్యస్వామి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు.

గతంలో 1997లో కెనడాలో జరిగిన ఓ మ్యాచులో పాకిస్థాన్ పై ఇండియా గెలవడంతో సరిపోయిందిగానీ… యూపీకి చెందిన సయ్యద్ సాబాకరీం బాగా ఆడి ఉండకపోయినా.. ఆ కారణంగానే ఇండియా ఓటమిపాలై ఉన్నా… ఇలాగే విద్వేషాలు, దురభిప్రాయాలు వ్యాప్తి చెందేవేమో! ఎందుకంటే అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న వినోద్ కాంబ్లీ.. మరో ముసల్మానైన అజహారుద్దీన్ వల్ల రన్నౌటయ్యాడు. తన స్వయంకృతాపరాధంతో ఆ మ్యాచులో అజార్ కూడా రన్నౌటయ్యాడు. ఆ మ్యాచులో భారత్ పాక్ పై ఓటమి అంచులకు చేరుకుంది. కానీ సాబాకరీం కనుక ఆదుకోకపోతే… సేమ్ టూ సేమ్ ఈరోజు షమీపై జరిగిన ప్రచారం ఆరోజూ జరిగేది. అయితే ఆ సమయానికి సోషల్ మీడియా ఇంతగా పుంజుకోకపోవడం.. ఓ కలిసివచ్చే అంశమైతుండే. అంతే తేడా!

సో…పాక్ – భారత్ మ్యాచెప్పుడు జరిగినా.. కులాలు, మతాలు, భావోద్వేగాలు, ఆటతీరు, టాస్ గెలవడం ఇలా ఏదో ఒక అంశాన్ని పట్టుకుని చర్చ చేయడం సర్వసాధారణమే. ఆ చర్చల వల్లే ఇలా విశ్లేషణలకూ ఆస్కారముంటుంది. కానీ ఆ చర్చల్లో.. స్ఫూర్తిదాయకమైన అంశాల కంటే.. యథావిధిగా హ్యాట్రెడ్ అంశాల పట్లనే జనానికెక్కువ మోహముండటం మంచి కన్నా చెడే ఎక్కువ ఆకర్షిస్తుందనే ఓ జనరలైజ్డ్ కామెంట్ ను బలపర్చడమే మరి!

-రమణ కొంటికర్ల

Also Read:

ఫార్మా కంపెనీల లీలలు

Also Read:

అల్లిపూల వెన్నెల

Also Read:

ఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్